హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం చేసిన అడ్డుకోవడానికి బీజేపీ మొదటి నుంచి పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ భూములు యూనివర్సిటీకి చెందాలని బీజేపీ ఎంపీలుగా తాము పోరాటం చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్సీయూ భూముల గురించి మాట్లాడిన తర్వాత కూడా మాజీ మంత్రి కేటీఆర్ చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని అనడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్ రావు విమర్శించారు.
*కేటీఆర్కు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..
సాధికారిత కమిటీని అన్ని ఆధారాలతో కన్విన్స్ చేశామని రఘునందన్ రావు చెప్పారు. ఇవాళ(శనివారం) బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. నాలుగు వందల ఎకరాల కోసం తాము గొంతు చించుకొని మాట్లాడుతున్నామని అన్నారు. కేటీఆర్కు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా అని ప్రశ్నించారు. 111 జీవో రద్దు చేసినప్పుడు ప్రకృతి కేటీఆర్కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. లక్షల ఎకరాల్లో 111 జీవో పరిధిలో ఫార్మ్ హౌస్లు కట్టుకోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పెద్దలు ఎలా అనుమతించారని నిలదీశారు. 111 జీవో పరిధిలో కేటీఆర్, హరీష్రావులకు ఫార్మ్ హౌస్లు లేవా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు..
111 జీవో రద్దు చేసినప్పుడు ప్రకృతి డిస్ట్రబ్ కాలేదా అని రఘునందన్ రావు అడిగారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, ఇద్దరి సిద్ధాంతాలు ఒకటే, రెండు పార్టీలు ఎంఐఎంకు దగ్గరగా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్కు బీజేపీ సమదూరంలో ఉందని అన్నారు. మోదీ జపం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం లేదని అన్నారు. తాము కేటీఆర్ గురించి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. హెచ్సీయూ గురించి బీజేపీ నేతలు మాట్లాడవద్దని చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఎక్కడిదని నిలదీశారు. ORR పక్కన హై రైస్ బిల్డింగ్లకు కేటీఆర్ ఎలా అనుమతించారని నిలదీశారు. పర్యావరణం గురించి మీకు మాట్లాడే హక్కు ఎక్కడిదని అన్నారు. రేవంత్కు, కేటీఆర్కు తాను సమదూరంలో ఉన్నానని చెప్పారు. హెచ్సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపిస్తున్నారని.. ఆ పేరు ఎందుకు బయటకు చెప్పడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు..