హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించి అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.
అయితే ఎర్త్క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తారు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.
రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారిక సమాచారం. అయితే భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎర్త్క్వేక్ వెబ్ సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు. కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 1969 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రత గల భూకంపం వచ్చింది. అది అప్పల్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు. ఆ తరువాత 1998లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా 4.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. అలాగే హైదరాబాద్లో 1984, 1999, 2013లో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా… ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. అలాగే శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో భూమి కంపించినట్లు రికార్డు అయ్యాయి. అయితే భూకంపాల రాకను కచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది. తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు సంభవించనప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట..