నాగర్ కర్నూల్: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. గతేడాది వేల సంఖ్యలో ఇలాంటి కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా విమానాశ్రయాలు, విద్యాసంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ సచివాయాలనికి సైతం అటువంటి బాంబు బెదిరింపు కాల్సే వచ్చాయి. ఓ దుండగుడు ఫోన్ చేసి మరీ అధికారులను నేరుగా బెదిరించాడు. ఈ ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, తాజాగా అటువంటి ఘటనే ఒకటి నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం 03:30 గంటలకు దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయాన్ని మెుత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్వ్కాడ్ బృందాలను రప్పించి అణువణువు తనిఖీ చేశారు. బాంబు ఎక్కడా కనిపించకపోవడంతో దీన్ని ఫేక్ బెదిరింపు మెయిల్గా అధికారులు తేల్చారు. ముప్పల లక్ష్మీనారాయణ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు కలెక్టరేట్ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ మెయిల్లో బెదిరింపుల సారాంశం అనంతరం అల్లాహు అక్బర్ అని రాసి ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడిని పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు..