హైదరాబాద్, జనవరి 6: ఫార్ములా-ఈ రేస్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్టచెప్పినట్టు వెల్లడించింది ప్రభుత్వం. గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు సమాచారం. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలియవచ్చింది. మొత్తం రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ చెల్లింపులు చేసినట్లు సమాచారం. కాగా.. ఫార్ములా ఈ రేస్కు గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్, ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈరోజు బయటకు వచ్చిన విషయంతో ఫార్ములా ఈ రేస్ వల్ల బీఆర్ఎస్ పార్టీ లబ్ది పొందినట్లు తేటతెల్లమైన పరిస్థితి.
మరోవైపు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. కాసేపటి క్రితమే కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అయితే లాయర్తో ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు. లాయర్ను బయటే ఉంచి విచారణకు వెళ్లాల్సిందిగా పోలీసులు చెప్పగా.. అందుకు కేటీఆర్ ససేమిరా అన్నారు. కచ్చితంగా లాయర్తోనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తన స్టేట్మెంట్ను తప్పుగా చూసే అవకాశం ఉన్నందున తన వెంట లాయర్ ఉండాల్సిందే అని తేల్చిచెప్పారు కేటీఆర్. చివరకు ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే కేటీఆర్ వెళ్లిపోయారు. లిఖితపూర్వకంగా ఏసీబీ ఏఎస్పీ అధికారి ఖాన్కు లేఖ రాశారు. ‘‘మీకు కావాల్సిన సమాచారం నేను అందజేస్తాను’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అనంతరం విచారణ కు న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగి వెళ్లిపోయారు..