ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ
హైదరాబాద్, మార్చి 14 ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటల సమయంలో అందజేస్తారు.
ఎస్సెస్సీ పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి 5గంటల వరకు స్కూళ్లను నిర్వహిస్తారు. పది పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి. పదో తరగతి స్పెషల్క్లాసులు యధావిధిగా నడుస్తాయి.