హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు….

On: Wednesday, August 27, 2025 11:35 AM

 

హైదరాబాద్:ఆగస్టు 27

హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు.

బుధవారం ఉదయం బడా గణనాథుడు కొలువు దీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు.ఈరోజు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు, మొత్తం పది రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం స్పష్టం చేసింది.

ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వాహన దారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

పీవీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్‌కు మళ్లిస్తారు.

పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా వచ్చే వారిని ఇక్బాల్ మినార్ వైపు పంపిస్తారు.

నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నిరంకారి నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లే వారిని పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు.

*పార్కింగ్ స్థలాలు:

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలంలో, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసుకోవచ్చు.

ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చేవారు తమ వాహనాల ను విశ్వేశ్వరయ్య భవన్‌లో నిలుపుకోవాలని అధికారులు సూచించారు.

రద్దీని నివారించేందుకు భక్తులు వీలైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

21 Jan 2026

Leave a Comment