అక్టోబర్ 28,
రోజురోజుకూ పెరుగుతున్న వీడిసి సభ్యుల ఆగడాలు ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామాల్లో జరిగిన ఘటనలు మరువకముందే — ఇప్పుడు వేల్పూరు మండలం మోతే గ్రామంలో మరోసారి వీడిసీ ఆగడాలు చోటుచేసుకున్నాయి.
మోతె గ్రామానికి చెందిన పోల జ్ఞానేశ్వర్ ఇంటి పక్కన గల స్థలాన్ని కొనుగోలు చేసి, గ్రామపంచాయతీ అనుమతితో గృహనిర్మాణ పనులు ప్రారంభించారు. సీసీ రోడ్డు పక్కన గేటును ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీ సెక్రటరీ నుండి అనుమతి తీసుకున్నారు. అయితే, కొంతమంది కాలనీవాసులు గేటు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు.
ఇదే విషయమై జ్ఞానేశ్వర్ వీడిసీ సభ్యులను ఆశ్రయించగా, వారు “జిపి రోడ్డు అందరూ వాడుకోవాలి” అంటూ స్పందించారు. కానీ, జ్ఞానేశ్వర్ అమెరికా వెళ్లిన తర్వాత, వీడిసీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, గేటు అడ్డుగా గోడలు నిర్మించాలని నిర్ణయించడంతో పాటు రూ.1.50 లక్షల జరిమానా విధించి, కులబహిష్కరణ చేస్తామని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, సంబంధిత అధికారులు — గ్రామ సెక్రటరీ, ఎంపీవో — న్యాయం చేయాలని ఆయన కోరారు.








