ఆర్మూర్: నిహారిక అనే విద్యార్థిని పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. తెలంగాణ మోడల్ స్కూల్ ఆర్మూర్లో 6వ తరగతి నుండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న నిహారిక, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో గణితంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం, సాంఘిక శాస్త్రంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించింది.
ముఖ్యంగా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సంధ్య రాణి గారి ప్రోత్సాహంతో నిహారిక మేధా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన అర్హత పరీక్షలో పాల్గొని ఎంపికైంది. ఆ అవకాశంతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినప్పటికీ, ప్రతిభ మరియు పట్టుదలతో ముందుకు సాగుతున్న నిహారికకు మేధా ఛారిటబుల్ ట్రస్ట్ ఉన్నత విద్య వరకు సహకారం అందించనుంది.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తన విజయానికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ A.V.R. శ్యామ్ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఆమె విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.








