చిన్నశంకరంపేట :
యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440 బస్తాల యూరియా రావడంతో కొంతమంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. మిగతా రైతులు ఈరోజు చేగుంటకు యూరియా వస్తుందని తెలుసుకొని తెల్లవారుజామున మూడు గంటల నుంచి టోకెన్ల కోసం రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. యూరియా రావడంలేదని తెలుసుకున్న అన్నదాతలు ఆగ్రహించి గాంధీ చౌరస్తా వద్ద చేరుకున్నారు. ప్రధాన కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరగంట పాటు రాస్తారోకో చేయడంతో మెదక్, అటు హైదరాబాద్, ఇటు నిజామాబాద్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి రాస్తారోకో వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. తమకు యూరియా వచ్చేవరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎస్సై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మంగళవారం యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.








