హైదరాబాద్:మార్చి 08:
నిరుద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. గుంటూరులో ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. పెదకాకాని మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ ఆలీ వెల్లడించారు. ఈనెల 9, 10 తేదీల్లో మహిళలకు, 12, 13 తేదీల్లో ఏపీకి చెందిన పురుష అభ్యర్థు లకు, 15, 16 తేదీల్లో తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఈ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు.. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత మహిళలు, పురుషులు మాత్రమే అర్హులు. ఆయా అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి. ఇంటర్ లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో ఏదైనా ఒక కోర్సును మొత్తం మార్కుల్లో 50 శాతం, ఇంగ్లీష్లో 50 శాతం మార్కులతో తప్పనిసరిగా పాసై ఉండాలి.
అభ్యర్థులు మెయిల్ ఐడీ సిద్ధం చేసుకొని, విద్యార్హ తకు సంబంధించిన పత్రా లు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించి 6 జీరాక్స్ కాఫీలు, 10 పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకొని నేరుగా ఏఎన్యూ వర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చు. అభ్యర్థులకు 1.6 కి.మీ పరుగు పందెం, ఫిజికల్, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాతపరీక్ష ఉంటుంది. ఒక తప్పు జవాబుకు పావు మార్కు చొప్పున నెగిటివ్ మార్కులు తీసేస్తారని షేక్ యాకూబ్ ఆలీ వివరించారు.
జీతభత్యాలు, సేవా నిధి:
అగ్నివీర్లు భారత వైమానిక దళంలో మొత్తం 4 ఏళ్ల పాటు విధుల్లో ఉంటారు. ఈ కాల పరిమితి ముగిసిన తర్వాత.. వారి పనితీరు, నైపుణ్యం ఆధారంగా గరిష్టంగా 25 శాతం మందిని శాశ్వత కేడర్లో చేర్చుకుంటారు. మిగిలిన వారు సేవా సర్టిఫికేట్తో రిటైర్ అవుతారు. మొదటి ఏడాది నెలకు రూ. 30,000తో ప్రారంభమై, నాలుగో ఏడాది నాటికి రూ. 40,000 వరకు పెరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థి జీతం నుంచి 30 శాతం కట్ చేసి, దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 4 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి సుమారు రూ. 11.71 లక్షలు ఒకే సారి అందజేయనున్నారు. విధి నిర్వహణలో ఉండగా అగ్నివీర్లకు రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది.







