ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ధైర్యం.
వడ్డీ రాకెట్లకు అంతు తప్పదు” – పోలీసుల భరోసా.
ఆర్మూర్, ఆగస్ట్ 25:
ఆర్మూర్ పట్టణంలో వడ్డీ వ్యాపారుల వల్ల వేధింపులకు గురవుతున్న బాధితులకు పోలీసుల మద్దతు లభిస్తోంది. సీపీ ఆదేశాల మేరకు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ స్వయంగా బాధితులను కలుసుకుని ధైర్యం చెప్పారు. ఎవరైనా భయపడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతూ, “వడ్డీ రాకెట్ల అంతు చూస్తాం. బాధితుల వెనుక పోలీసులుగా మేము నిలుస్తాం” అని స్పష్టమైన హామీ ఇచ్చారు.
సీఐ మాట్లాడుతూ, ఇకపై వడ్డీ రాకెట్ గూళ్లను సహించబోమని, ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పలువురు బాధితులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా, పోలీసుల ధైర్యసాహసాలు స్థానిక ప్రజల ప్రశంసలు పొందుతున్నాయి. “మాకు పరువు పోయింది కానీ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారి అసలైన రూపాన్ని బయటపెడతాం” అంటూ బాధితులు ధైర్యంగా స్పందిస్తున్నారు.
స్థానికులు కూడా “శబాష్ పోలీసన్నా! మాతో నిలిచారు” అంటూ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.








