ఆదిలాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వేరే దిక్కు లేక రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు ఉండి కూడా రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారం ఆపేసి రైతుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. తేమతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కవిత జాగృతి జనం బాట కార్యక్రమం ఆదిలాబాద్కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆమె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు కవితకు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీలు, తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆదివాసీల, రైతుల సమస్యలపై మాట్లాడారు..








