మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి చేసుకున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్కి చెందిన సందీప్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు సందీప్.
ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఎస్పీ పరితోష్ పంకజ్. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి కానిస్టేబుల్ సందీప్ భారీగా డబ్బులు నష్టపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడటానికి తన సహచరుల దగ్గర భారీగా అప్పులు చేశాడు. అయితే, అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సహచర కానిస్టేబుళ్లు ఒత్తిడి చేయడంతో సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యపై ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..








