A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ యువమోర్చా తీవ్రంగా ఖండించింది. ఆర్మూర్ పట్టణంలో జరిగే పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ – “ప్రజలను మోసం చేసిన హామీలపై ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం సిగ్గు చేటు,” అని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పలు హామీలను ఎత్తి చూపారు. “రెండు లక్షల రుణమాఫీ, తులం బంగారం, 5 లక్షల విద్యారుణం, 4000 రూపాయల చేయూత పెన్షన్… ఇవన్నీ 420 దొంగ హామీలు. ఇవే ప్రజలు నమ్మి ఓటేసి ఇప్పుడిది చవకబారు డ్రామా అవుతోంది,” అని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలు వీటికి భయపడబోరని, త్వరలోనే జరుగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని ఆయన హెచ్చరించారు.
ఈ ఘటనలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ సహా పలు స్థానిక నాయకులు అరెస్టయ్యారు. అరెస్టులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.







