ఫ్రెండ్గా నమ్మించి ఇంట్లో భారీ చోరీ…..
నిజామాబాద్, నవంబర్ 22: నేటి సమాజంలో కొందరు మంచితనం ముసుగులో దారుణాలకు తెగబడుతున్నారు. తమను నమ్మిన వారినే మోసం చేస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఇలాంటి చోరీలకు పాల్పడే వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. బాగా మాయమాటలు చెప్పి.. ఎదుటి వారికి తమపై నమ్మకం కలిగేలా చేసుకుంటున్నారు. ఆ తరువాత తమ చేతి వాటం చూపిస్తుంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ కిలాడీ లేడీ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహితురాలిగా నమ్మించి ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది. తెలిసిన అమ్మాయి కదా అని ఇంట్లోకి రానిస్తే చోరీ చేసి సీసీ కెమెరాకు చిక్కింది.
నిజామాబాద్ కుమార్ గల్లీలో గాయత్రి అలియాస్ గౌతమి అనే మహిళ బ్యూటీ పార్లర్లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంటి యజమానితో గౌతమికి పరిచయం పెరిగింది. ఇదే సమయంలో డూప్లికేట్ తాళం చేయించి గాయత్రి తన దగ్గర పెట్టుకుంది. యజమాని ఇంట్లో లేని సమయంలో సదరు మహిళ డబ్బులు దొంగిలిస్తూ ఉండేది. తరుచూ డబ్బులు కనిపించకుండా పోవడాన్ని ఇంటి యజమాని గుర్తించాడు. అసలు ఎవరు దొంగతనం చేస్తున్నారా అని గుర్తించడానికి స్పై కెమెరా అమర్చాడు. మొత్తం18 తులాల బంగారం 1.30 కిలోల వెండి, కొంత నగదు అపహరణకు గురైంది. సదరు మహిళ చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కిలాడి లేడిని అదుపులోకి తీసుకున్నారు..






