*మరోవైపు కొత్త కేసుల వరద.
న్యూఢిల్లీ ఎ9 న్యూస్ సెప్టెంబర్ 15
దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 88,417 వేలకు పైగా చేరుకుంది. కోర్టు చరిత్రలో ఇది గరిష్టస్థాయి. ఒకవైపు సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యమైన 34 మంది జడ్జీలతో పని చేస్తున్నా పెండింగ్ కేసులు ఈ విధంగా పేరుకుపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజీ) సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో ఆగస్టు చివరి నాటికి 69,553 సివిల్ కేసులు, 18,864 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు కొత్త కేసులు దాఖలు చేయడం కూడా కొనసాగుతోంది. ఆగస్టు సమాచారం ప్రకారం ఈ నెలలో తీర్పు ఇచ్చిన కేసుల కంటే కొత్తగా వచ్చిన కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఆగస్టులో 5,667 కేసులను పరిష్కరిం చగా, కొత్తగా 7,080 కేసులు విచారణ ప్రారంభమయింది. పెండింగ్ కేసులను తగ్గించడానికి వేసవి సెలవుల్లో కూడా అదనపు ధర్మాసనాలతో పని చేసినా పెండింగ్ కేసులు పెరిగాయి. ఈ ఏడాది మే 23 నుంచి జులై వరకు ఉన్న వేసవి సెలవులను ‘పాక్షిక పని దినాలు’గా పేరు మార్చి మొత్తంగా 21 ధర్మాసనాలు కేసులను విచారించాయి. ఈ ఏడాదిలో ఆగస్టు వరకూ 52,630 కొత్త కేసులు దాఖల య్యాయి. అలాగే 46,309 కేసులను పరిష్కరించారు. అలాగే ఈ ఏడాదిలో సుప్రీంకోర్టు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులను చూసింది. నవంబర్లో మరొక ప్రధాన న్యాయమూర్తి (జస్టిస్ సూర్యకాంత్) నవంబర్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గతేడాది ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవారు పెండింగ్ కేసులను తగ్గించడానికి ఎంతగానో కృషిచేసినా.. పెండింగ్ కేసులు 82 వేలకు పైగా చేరుకు న్నాయి. కరోనా లాక్డౌన్ నుంచి పెండింగ్ కేసుల సమస్య తీవ్రంగా మారింది. దీంతో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం కోర్టుల జడ్జీల ఖాళీలను భర్తీ చేయడానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవై కూడా తమ కొలీజియంల ద్వారా కేంద్రానికి సుప్రీంకోర్టు జడ్జీల పేర్లును వేగంగా సిఫార్సులు చేసేవారు. అయినా పెండింగ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అలాగే, గత ప్రధాన న్యాయమూర్తులు, కొలీజియంలు కూడా ‘భారీ పనిభారం’, ‘అధిక ఒత్తిడి’ అంశాలను లేవనెత్తాయి. పనిభారం ఎంతగా ఉందంటే ఒక్క ఖాళీని కూడా కోర్టు భరించలేని స్థితికి చేరుకుందని తెలిపాయి. దీంతోనే సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు లను వేగంగా ఆమోదించాల్సిన స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది.







