A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
గణేష్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేడు నందిపేట్లోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలు తదితరాలను సమీక్షించారు. అనంతరం నందిపేట్ సబ్-ఇన్స్పెక్టర్కు పలు సూచనలు చేస్తూ, నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా డీజే లకు అనుమతి ఇవ్వరాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు కూడా పోలీసు విభాగానికి సహకరించి, గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్ ఎస్సై శ్రీ జి. శ్యామ్ రాజ్ పాల్గొన్నారు.







