భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు.
వర్షాలు మొదలైనప్పటి నుండి కామారెడ్డి జిల్లాకు చేరుకునే వరకు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, వర్షాల పరిస్థితిని నిశితంగా సమీక్షించిన సీతక్క, ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు చేశారు. అధికారులను అప్రమత్తంగా ఉండమని ఆదేశించి, తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
వర్షం ఆగకపోయినా, జోరు వానలోనే వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. రోజంతా వర్షంలో తడుస్తూ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క బాధితుల సమస్యలు విన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయం పై తగు సూచనలు చేశారు.
నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో విస్తృత సమీక్ష నిర్వహించి, వరద నియంత్రణ చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. బాధితులకు తక్షణ సాయాన్ని అందించడంలో అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు అధైర్యపడకూడదు… ప్రభుత్వం అండగా ఉంటుందనీ ధైర్యం నింపిన సీతక్క పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారీ వర్షాన్ని లెక్కచేయకుండా.. బాధితులకు బాసటగా నిలిచి, మనోధైర్యం కల్పించిన సీతక్క శభాష్ అని ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి పర్యటన ముగించుకున్న మంత్రి సీతక్క శుక్రవారం రోజు ములుగు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత గ్రామాలను సందర్శించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.







