హైదరాబాద్: సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజాసింగ్ని ఘనంగా సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో రాజాసింగ్ మాట్లాడారు. వేలాదిమంది సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారని చెప్పుకొచ్చారు.
యావత్ భారతదేశంలో ఉండే హిందువుల అందరిపై సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. దర్శనం అనంతరం ఓ మంత్రి తనతో మాట్లాడారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా అందరి లక్ష్యం ఒకటేనని, మోడల్ గోశాల కట్టడానికి తన సహకారం కావాలని ఆ మంత్రి తనను కోరారని చెప్పుకొచ్చారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని వైభవంగా కడతామని గత ప్రభుత్వాలు గుడిపై రాజకీయం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే రాజాసింగ్.
కాంగ్రెస్ ప్రభుత్వం అయిన సింహవాహిని మహంకాళి అమ్మవారి గుడిని వైభవంగా కట్టాలని కోరానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ జరగకుండా పటిష్ట చట్టం తీసుకురావాలని కోరారు. ‘బోనాలపై తాగి ఆడే బోనాలు’ అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారం తప్పు అని.. బోనాలపై కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు. అమ్మవారికి బోనం పెట్టి మంచి జరగాలని.. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకుంటారని తెలిపారు. బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలాకాలంగా కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు..