*వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్లో దశావతార సైకత శిల్పాల అద్భుత ప్రదర్శన….
*ఇసుక శిల్పాలతో చరిత్ర సృష్టించిన ఆర్మూర్..!
*ఆర్మూర్ను ప్రపంచ పటంపై నిలిపిన దశావతార శిల్పాలు….
A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆధ్యాత్మిక–సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహావిష్ణువు దశావతార సైకత శిల్పాల ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
భగవంతుడు విష్ణువు యొక్క మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఇసుక శిల్పాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. కళాత్మక నైపుణ్యం, భక్తి భావం సమ్మేళనంగా రూపొందిన ఈ ప్రదర్శనను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను చేకూర్చుతూ, భారతీయ ప్రపంచ ప్రఖ్యాత ఇసుక శిల్పాల కళాకారుడు, యానిమేటర్, కథకుడు బాలాజీ వరప్రసాద్ చే తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఈ దశావతార సైకత శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇది ఆర్మూర్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా నిలిచింది.
ఈ అద్భుత ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం ఆర్మూర్ పట్టణానికి గర్వకారణంగా మారింది. స్థానిక యువత ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనడం అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు.
ఈ సందర్భంగా విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, సంప్రదాయాలు–సంస్కృతిని కాపాడటంతో పాటు యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ విజయం ద్వారా ఆర్మూర్ పేరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలిచేలా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.






