
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు ప్రయాణిస్తుండగా, అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసి, లారీ మరియు బస్సు డ్రైవింగ్ పరిస్థితులు, వేగం, సడెన్ బ్రేకింగ్ వంటి కారణాలతో సహా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.








