A9 న్యూస్, నిజామాబాద్:
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలు, లోతట్టు వంతెనలు దాటవద్దని, వరద ప్రాంతాల్లో సెల్ఫీలు, రీల్స్ చేయవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, కూలీలు విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.








