కేసీఆర్కి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ సవాల్…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ నోరు జారి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని మందలించారు. ఆయనలా దిగజారి తాము మాట్లాడమని చెప్పుకొచ్చారు. ప్రజలే కేసీఆర్ అండ్ కోకు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా తాము దుర్వినియోగం చేయట్లేదని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఇవాళ(మంగళవారం) తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పాత పినపాక, అన్నారుగూడెం, లింగాల గ్రామాల విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి, మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు భట్టి విక్రమార్క.
తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులకు అవసరమైన విద్యుత్తు అందించేందుకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన నీరు అందించాలంటే విద్యుత్తు ఎంతో అవసరమని వివరించారు. రాష్ట్రంలో లో వోల్టేజీ లేని విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 56 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క.
కాంగ్రెస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఫామ్హౌస్లో కూర్చున్న కేసీఆర్ బయటకు వచ్చి విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత నేడు మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. సభలో చర్చలో ఆయన పాల్గొన్నాలని సూచించారు. కేసీఆర్ అండ్ కోకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాము సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, బీమా పథకం అమలు చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు..







