హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా రైతు సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
రేవంత్ ప్రభుత్వం అడిగినట్లుగా రైతులు ఆధార్ కార్డులు ఇచ్చినా, వారికి కనీసం బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకుందో రైతులకు రేవంత్ ప్రభుత్వం వివరించాలని కోరారు. రూ.266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని నిలదీశారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తోంది ఎవరని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో చెప్పాలని అన్నారు. ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు..