వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్.

On: Thursday, January 15, 2026 12:38 PM

 

కరీంనగర్:

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వంచనకు పాల్పడుతూ, వలపు వల వేసి, దాదాపు వంద మందికి పైగా బాధితులను మోసం చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*కేసు వివరాలను సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు….

గత రెండు సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణ పరిధిలోని ఆరేపల్లిలోని శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు, ఇన్‌స్టాగ్రామ్‌లో వలపు ఫోటోలు పోస్టు చేసి యువకులు, బడా వ్యాపారస్తులు సహా సుమారు వంద మందిని తమ ట్రాప్‌లోకి ఆకర్షించి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితులను అపార్ట్‌మెంట్‌లోకి రప్పించి, మహిళతో ఉన్న సమయంలో భర్త వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసేవారు. ఈ అక్రమ వసూళ్లతో వారు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయడమే కాకుండా, విలాసవంతమైన జీవితంను గడుపుతూ కారు ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

ఇప్పటివరకు దాదాపు వంద మందికి పైగా వ్యక్తులను ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇదే తరహా బ్లాక్‌మెయిల్ ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదై, నిన్ను ఉదయం (బుధవారం) దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారుతో పాటు నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వెల్లడించినట్లు, నిందితులు మంచిర్యాల జిల్లా వాసులుగా గుర్తించబడ్డారు.

04 Feb 2026

Leave a Comment