జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం డా.బిఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు.
దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీ.ఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు.
భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాహుల్ రాజ్ , డిఎంఓ జోజి ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, జైచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







