*వీడీసీ పెత్తానాలు, కుల బహిష్కరణలపై వివరణ.
ఆర్మూర్, ఆగస్ట్ 7, 2025:
ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీ) పెత్తానాలు, సామాజిక వివక్ష, కుల బహిష్కరణలు జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు షేక్ అనీఫ్ గురువారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో షేక్ అనీఫ్ మాట్లాడుతూ, ఆర్మూర్ డివిజన్లోని పలు గ్రామాల్లో వీడీసీ సభ్యులు నిర్బంధాలు, బెదిరింపులు, కుల ఆధారిత భేదభావాలు తీసుకుంటున్న తీరును వివరించారు. పేద, బడుగు వర్గాల ప్రజలు మానసికంగా మరియు భౌతికంగా వేధింపులకు గురవుతున్నారని, కొన్ని చోట్ల కుల బహిష్కరణలు దురదృష్టకరంగా చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై స్పందించిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో తీసుకుని, సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. “న్యాయం జరగకపోతే, అది ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం అని అర్థం. బాధితులకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశం గ్రామీణ ప్రజల హక్కుల పరిరక్షణలో ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.