హైదరాబాద్:మార్చి 28:
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు పన్ను రేట్లను పెంచకపోయినా, జీత నిర్మాణాన్ని ప్రభావితం చేసే విధంగా కీలక మార్పు లను తీసుకువస్తున్నాయి.
ఈ మార్పుల అమలు బాధ్యతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది. నిపుణుల ప్రకారం.. ఉద్యోగుల మొత్తం కాస్ట్ టు కంపెనీ యథాతథంగా ఉన్నప్పటికీ, జీతంలోని భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇప్పటివరకు పన్ను రహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్మెంట్లు, ఇతర ప్రయోజనాలను కొత్త నిబంధనల ప్రకారం స్పష్టంగా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు.
దీంతో ఉద్యోగుల పన్ను విధించదగిన ఆదాయం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో గతంలో అమలులోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపించనుంది. ఈ చట్టాల ప్రకారం ఉద్యోగి బేసిక్ జీతం మొత్తం సీటీసీ లో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ లెక్కింపు లు పెరిగే అవకాశం ఉంది.
అయితే దీని ప్రభావంగా ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ జీతం కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. అదనంగా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతోంది. కంపెనీ వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వాహనం, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించ బడతాయి. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.








