ఈ నెల 26 నుంచి 29 వరకు మోస్తరు వర్షాలు పడే చాన్స్-వాతావరణ శాఖ వెల్లడి…
హైదరాబాద్, మార్చి 24 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ తర్వాత ఈనెల 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్,సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే 48 గంటలు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. కాగా, గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.52 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది.








