A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం డీజే సౌండ్ వ్యవస్థ యాజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎచ్ఓ సత్యనారాయణ గౌడ్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్లను వినియోగించకూడదని స్పష్టం చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీలు ఇప్పటికే డీజే సిస్టమ్లకు బుకింగ్లు చేసుకుని ఉంటే, వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు.
“భక్తి ప్రపత్తితో ఉత్సవాలు నిర్వహించాలి. అధిక శబ్దంతో వృద్ధులకు, చిన్నపిల్లలకు ఇబ్బందులు కలిగించే డీజేలకు ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతులు ఉండవు” అని సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు.
అలాగే, శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. డీజే వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.