ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేయండి.
రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం.
హైదరాబాద్, జూలై 4 రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..?
పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీక్షావిధానం ఉండాలన్న ది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో కేంద్రవిద్యాశాఖ అన్ని రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా, పాఠశాల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో రెండు బోర్డులుండటంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేసింది.
రెండుబోర్డులను విలీనం చేయాలని సూచించగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో పదో తరగతి వరకు పాఠశాల విద్య, 11, 12 తరగతులను ఇంటర్బోర్డు నిర్వహిస్తున్నాయి. 8 రాష్ర్టా ల్లో ఒకలా.. సీబీఎస్ఈ సహా 21 రాష్ర్టా ల్లో మరోలా ఉండటంతో, 8 రాష్ర్టాలను కేంద్రం దారికి తెచ్చుకునే పనిలో పడింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్స్ రద్దు చేయడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. 100 మార్కులకు పరీక్షలను ఎలా నిర్వహిస్తారని నిలదీసింది. వొకేషనల్ కోర్సులకు సర్టిఫికెట్లు ఇస్తున్న తీరు సవ్యంగా లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినట్టు సమాచారం.
ఇంటర్ విలీనం తప్పదా.
తాజా పరిస్థితులు చూస్తుంటే ఇంటర్బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. బుధవారం విద్యాశాఖపై రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. 9-12 తరగతులు ఒకే దగ్గర నిర్వహించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం విద్యాశాఖ ఆదేశాల తర్వాతే సీఎం సమీక్షించడం, విలీనానికే రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ నడుస్తున్నది.