– జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో కాజీపేట-బల్లార్షా, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికుల భద్రత చర్యల్లో భాగంగా 78 స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని వివరించారు.
మరో 453 స్టేషన్లకు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిపారు. అమృత్భారత్ స్టేషన్లో భాగంగా 119 స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నట్టు వివరించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ రైల్వే అధికారులకు సూచించారు..





