A9 న్యూస్ ప్రతినిధి:
భక్తి భావన ఆధ్యాత్మికతతో పాటు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి అవధూత దత్త పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదిన వేడుకల్ని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ గురుదత్త ఆశ్రమం వ్యవస్థాపకులు నాగసాధు కైవల్య దత్తానందగిరి స్వామీజీ – శారదా మాతాజీ ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశ్వకళ్యాణార్థమై గణపతి హోమాన్ని యాగ్నికుడిచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా నిర్వహించే స్వామీజీ వారి పాదుకాపూజను పాలతో అభిషేకించి సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. తదనంతరం మహాత్ములు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు భక్తి భావనలను అలవరచుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సేవా తత్వాన్ని పెంపొందించుకొని సరైన గురువును ఎంచుకొని వారి మార్గదర్శనంలో నడవాలని హితవు పలికారు. తదనంతరం “దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా… అంటూ సామూహిక ఆధ్యాత్మిక భజనలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక ఎడపల్లి మండల గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేద మహిళలకు, ఆశ్రమంలో సేవలు అందిస్తున్న మహిళలకు 170 చీరలను పంపిణీ చేశారు. గురువులను ఘనంగా సన్మానించి గురు దక్షిణను కైవల్య దత్తానందగిరి స్వామీజీ అందజేశారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన పేద విద్యార్థిని ఉప్పు వైష్ణవి పి. జి. చదువుకొరకై 5 వేల రూపాయలను శ్రీ గురుదత్త ఆశ్రమం ఎడపల్లి ట్రస్ట్ తరపున విరాళంగా అందజేశారు. దత్త బంధువులను, దత్త సేవకులను, దత్త కార్యకర్తలను కూడా సన్మానించారు. అన్న పూజ చేసి అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముంజెల రెడ్డి, నరేందర్ (ఏ.ఆర్.పి క్యాంప్), మస్కూరి గంగాధర్, జంగం గంగాధర్, కంకణాల రాజేశ్వర్, కోటగిరి బాల గంగాధర్, యోగేష్ తో పాటు ఎడపల్లి, బోధన్, నారాయన్ ఖేడ్, తదితర ప్రాంతాల నుండి పాల్గొన్నారు.