చెన్నై, మర్చి 22: డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫెయిర్ డిలిమిటేషన్ జేఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలు ఉద్యోగ ఉపాధి కల్పనల్లో పాటు జీడీపీ పెరుగుదల సంక్షేమ పథకాల అమలు వంటి అన్నిటిలోనూ ముందంజలో ఉందన్నారు. బీహార్ ఒక రూపాయి కేంద్రానికి పన్ను కడితే ఆరు రూపాయలు పొందుతోందని.. ఉత్తరప్రదేశ్ రెండు 30 పైసలు పొందుతోందని తెలిపారు. అయితే కర్ణాటక 26 పైసలు, తమిళనాడు 16 పైసలు, తెలంగాణ 42 పైసలు పొందుతోందని చెప్పుకొచ్చారు. జనాభా ప్రాతపదికన డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని వెల్లడించారు.
యూపీ, ఎంపీ, బీహార్ తదితర రాష్ట్రాల డామినేషన్ అంగీకరించేది లేదన్నారు. 2026లో మోడీ డీలిమిటేషన్ అమలు చేయదలిస్తే ఇందిరాగాంధీ, వాజ్పేయి మార్గాలు అనుసరించాలని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ రాష్ట్రాల అంతర్గతంగా చేస్తూ మహిళా రిజర్వేషన్, ఇతర రిజర్వేషన్లు అమలుకు పూనుకోవాలని అన్నారు. ప్రస్తుత 534 సీట్లలో దక్షిణాదికి 130 సీట్లు ఉందని… అంటే 24 శాతం ఉందన్నారు. దీన్ని 33 శాతానికి పెంచాలని… ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు మరింత పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆ విజయానికి ఇది శిక్ష: స్టాలిన్
పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన న్యాయసమ్మతంగా జరిగే వరకు తాము దానిని అంగీకరించలేమని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాలను తగ్గించడం తీవ్రమైన ముప్పుగా మారుతుందన్నారు. జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు తమకు శిక్ష విధించబడుతోందన్నారు. ఇప్పటికే మణిపూర్కు పార్లమెంట్లో పరిమిత ప్రాతినిధ్యం ఉండటం వల్ల వారి గొంతుక నిశ్శబ్దం చేయబడుతోందని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు.
కాగా.. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి హాజరవగా… కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు..