కేటీఆర్‌ను వదలబోమంటున్న తెలంగాణ సర్కార్.. సుప్రీంలో కీలక పిటిషన్:

 

హైదరాబాద్, జనవరి 8: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ కేవియట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంలో సవాలు చేసే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయిన సర్కార్.. సుప్రీంలో కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ వేయడం అనేది వ్యూహాత్మకమైన లీగల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇది కేసు విచారణలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.

 

ఈ కేవియట్ దాఖలు చేయడం వల్ల కేటీఆర్ తరపున పిటిషన్ దాఖలైన సమయంలో మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇచ్చే ముందు తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినడం తప్పనిసరి అవుతుంది. ఏకపక్ష తీర్పు రాకుండా ఈ కేవియట్ ద్వారా నివారించే అవకాశం ఉంటుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి కేటీఆర్ ప్రయత్నిస్తే కేవియట్ పిటిషన్ ద్వారా తక్షణమే జారీ అయ్యే అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించిన తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

 

మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్చ్ వారెంట్ కోసం కోర్టు అనుమతి పొందింది ఏసీబీ. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై సోదాలకు కోర్టు సర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకోనున్నారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలుపై దర్యాప్తు చేయనున్నారు. హెచ్‌ఎమ్‌డీఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలను ఏసీబీ అధికారులు సేకరించనున్నారు..

Leave a Comment