రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో…

On: Sunday, December 14, 2025 4:07 PM

 

అమరావతి:డిసెంబర్ 14

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు 38,267 బూత్‌ల్లో పోలియో చుక్కలు వేసేందుకు 61.26 లక్షల డోస్‌లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాల్లో 1140 బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 21న పోలియో దినం సందర్భంగా బూత్‌ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆ రోజు ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేసుకోలేక పోయిన పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తాయని వివరించారు.

1704 మంది వైద్యాధి కారులు, 39,494 మంది ఇతర సిబ్బంది, 4206 మంది పర్యవేక్షకులు కార్య క్రమంలో పాల్గొంటారని తెలిపారు. సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు కవర్‌ చేయడానికి 1854 మొబైల్‌ బృందాలు పని చేస్తాయన్నారు.

ప్రతి మొబైల్‌ బృందంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారన్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్లలో 21, 22, 23 తేదీల్లో బృందాలు పర్యటిస్తాయి.

12 Mar 2026

Leave a Comment